వాషింగ్టన్: జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ లో కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి సమయంలో జరిగిన ఒక తప్పిదం కారణంగా దాదాపు 15 మిలియన్ డోసులకు సరిపడా ఔషధ పదార్థాలు అన్నీ వృథా అయినట్లు సమాచారం. ఆ కంపెనీకి చెందిన ఇద్దరు ఉద్యోగుల ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే కంపెనీ ప్రస్తుతం పరిస్థితిని చక్కదిద్దిడంతో పాటు వ్యాక్సిన్ డెలివరీ టార్గెట్ని కూడా రీచ్ అయినట్లు తెలిపారు.
బాల్టిమోర్లోని ఎమర్జెంట్ బయో సొల్యూషన్స్ ఇంక్ కేంద్రంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. దీని వల్ల మే నాటికి దేశంలో పెద్దలందరికి వ్యాక్సిన్ ఇవ్వాలనే అధ్యక్షుడి ఆలోచనకు బ్రేక్ పడవచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇక తప్పిదం సంభవించిన యూనిట్ నుంచి ఒక్క డోసును కూడా బయటకు పంపలేదని తెలిసింది.
కాగా ఈ విషయంపై కంపెనీ నుంచి అధికారిక ప్రకటన ఏదీ విడుదల కాలేదు.ఇక ఒక బ్యాచ్ ఔషధ పదార్థాలు క్వాలిటీ టెస్ట్లో ఫెయిల్ అయినట్లు జాన్సన్ అండ్ జాన్సన్ మాత్రం ఒక ప్రకటన చేసింది. ప్లాంట్లో ఉత్పత్తి సమయంలో తలెత్తిన లోపం గురించి తొలుత న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది.
అనుకోకుండా కార్మికులు జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్కు సంబంధించని ఔషధ పదార్థాలను కొన్ని ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ పదార్థలతో కలిపినట్లు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. దీని గురించి ఆస్ట్రాజెనికా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ తప్పిదం అమెరికాలో వ్యాక్సినేషన్ కార్యక్రమంపై ప్రభావం చూపుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. కోవిడ్ టీకా కార్యక్రమం కోసం జాన్సన్ అండ్ జాన్సన్తో పాటు ఫైజర్, మోడర్నా కంపెనీలు వ్యాక్సిన్లను సరఫరా చేస్తున్నాయి.