కశ్మీర్: జమ్ముకశ్మీర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పహల్గామ్ ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో భద్రతా పరిరక్షణ చర్యల్లో భాగంగా, లోయలోని 50కి పైగా పర్యాటక ప్రాంతాలు, ట్రెక్కింగ్ మార్గాలను తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. పర్యాటకుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
గత వారం పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి తీవ్ర కదలికలకు దారి తీసింది. భద్రతా సమీక్ష అనంతరం ప్రభుత్వం వెంటనే చర్యలకు దిగింది. ముఖ్యమైన ట్రెక్కింగ్ మార్గాలు, జలపాతాలు, లోయలు, రిసార్టులు, హోటల్స్ ఉన్న ప్రాంతాలను తాత్కాలికంగా మూసివేసారు.
బందిపోరా జిల్లాలోని గురేజ్ వ్యాలీ, బుద్గాం జిల్లాలోని యూస్మార్గ్, దూద్పత్రి వంటి ప్రసిద్ధ ప్రాంతాలే కాకుండా, అనంత్నాగ్, కుప్వారా, సోపోర్, బారాముల్లా, పుల్వామా, గండేర్బల్ జిల్లాల్లోని అనేక పర్యాటక ప్రదేశాలను కూడా జాబితాలో చేర్చారు.
శ్రీనగర్లోని జామియా మసీద్, బాదామ్వారి వంటి ప్రాంతాలతో పాటు, పలు హోటల్స్, రిసార్ట్స్ను కూడా మూసివేస్తున్నారు. ఈ చర్యలు పూర్తిగా భద్రతా పరిస్థితులను మెరుగుపర్చే దిశగా తీసుకున్నాయని అధికారులు తెలిపారు.
సమస్య పరిష్కారమైన తరువాతే ఈ ప్రాంతాలను తిరిగి పర్యాటకులకు తెరవనున్నట్లు సమాచారం. అప్పటివరకు పర్యాటకులకు పహల్గామ్ పరిసర ప్రాంతాలకు వెళ్లకుండా అధికారిక సూచనలున్నాయి.