న్యూఢిల్లీ: భారత ప్రధాని మోదీపై నమ్మకంతోనే బీజేపీలో చేరినట్టు సీనియర్ నటిమణి కుష్బూ తెలిపారు. సోమవారం బీజేపీలో చేరిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రధాని దేశాన్ని సరైన మార్గంలో ముందుకు తీసుకెళ్తారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మోదీ నేతృత్వంలోని బీజేపీలో చేరినందుకు చాలా ఆనందంగా ఉందని, ఏ బాధ్యత అప్పగించినా చిత్తశుద్ధితో పనిచేస్తానని చెప్పారు. తమిళనాడులో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం కోసం తన వంతు సాయం చేస్తానని అన్నారు. శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీని వీడిన కారణం సోనియా గాంధీకి రాజీనామా లేఖలో పేర్కొన్నానని వెల్లడించారు. తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ ఏ రోజూ విజయం కోసం పనిచేయలేదన్నారు. తాను టికెట్ కోసం ఎప్పుడూ అడగలేదని, తన రాజీనామాకు అది కారణం కాదన్నారు. తనతో కాంగ్రెస్ నేతలకు ఈగో సమస్యలు ఉన్నాయోమోనని అన్నారు.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు మురుగన్ సమక్షంలో అంతకుముందు బీజేపీలో కుష్బూ చేరారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సమీపిస్తున్న నేపథ్యంలో కుష్బూ రాజీనామా కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కుష్బూకు బీజేపీ ఎటువంటి బాధ్యతలు కట్టబెడుతుందోనని రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. తమ పార్టీ నుంచి కుష్బూ వెళ్లిపోయినా నష్టం ఏమీ ఉండబోదని తమిళనాడు కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యానించారు.