చెన్నై: మద్రాస్ హైకోర్టు ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘంపై సంచలన వ్యాఖ్యలను చేసింది. ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి రెండో దశలో ప్రమాదకర స్థితిలో ఉందని వ్యాఖ్యానించింది. ప్రతిరోజు దేశం మూడు లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని ఆందోళన వ్యక్యం చేసింది. కాగా ఇవన్నీ అయిదు రాష్ట్రాల్లో ఎన్నికలు, కుంభ మేళా, ప్రజల నిర్లక్ష్యం కారణంగా కేసులు తీవ్ర స్థాయిలో నమోదవుతున్నాయని తెలిపింది.
కోవిడ్ కేసులతో విపత్తు ముంచుకొస్తున్న తరుణంలో రాజకీయ పార్టీల ర్యాలీలకు ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించింది. ఈ ఎన్నికల సందర్భంగా ర్యాలీలు జరుగుతున్నప్పుడు మీరు వేరే గ్రహంలో ఉన్నారా? అని ఈసీఐ కౌన్సిల్ను ఉద్దేశించి చీఫ్ జస్టిస్ సంజిబ్ బెనర్జీ వ్యాఖ్యానించారు.
తమిళనాడులో కరోనా సెకండ్ వేవ్ విజృంభించడానికి ఎలక్షన్ కమిషన్ ఏకైక అతి పెద్ద కారణమని మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈసీ అధికారులపై మర్డర్ కేసులు పెట్టాలని పేర్కొంది. కరోనా కట్టడికి సరైన ప్రణాళిక లేకుంటే మే 2న విడుదలయ్యే ఫలితాలను నిలిపివేస్తామని హెచ్చరించింది.
ఏప్రిల్ 30న కోర్టు మరోసారి కౌంటింగ్ డేకు సంబంధించిన యాక్షన్ ప్లాన్పై సమీక్ష జరుపుతుందని తెలిపింది. తమిళనాడులో గడిచిన 24 గంటల్లో 15,659 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 10,81,988కి చేరుకుంది.
తాజాగా నమోదైన మొత్తం కేసుల్లో 4206 కేసులు ఒక్క చెన్నై నగరంలోనే వెలుగు చూశాయి. కరోనా మరణాలు కూడా తమిళనాడులో కలకలం రేపుతున్నాయి. ఆదివారం రోజు కరోనా సోకి 82 మంది మరణించారు.