పట్నా: చివరి ఓట్ల లెక్క వరకు సాగిన ఉత్కంఠభరిత బిహార్ అసెంబ్లీ ఎన్నికల హోరాహోరీ పోరులో చివరకు అధికార ఎన్డీయే మళ్ళీ విన్నింగ్ షాట్ కొట్టింది. చివరి వరకు గట్టి పోటీ ఇచ్చిన ఆర్జేడీ నేతృత్వంలోని మహా కూటమి విజయానికి కొద్ది దూరంలో ఆగిపోయింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మంగళవారం అర్ధరాత్రి వరకు కొనసాగింది.
243 స్థానాల అసెంబ్లీలో మెజారిటీ మార్క్ 122 కాగా, అంతకన్నా కేవలం రెండు సీట్లు ఎక్కువ గెలుచుకుని 124 సీట్లతో ఎన్డీయే అధికారంలోకి రానుంది. అయితే, అత్యధిక స్థానాలు గెలుచుకుని ‘పార్టీ ఆఫ్ ది మ్యాచ్’ గా ఆర్జేడీ నిలిచింది. ఆ పార్టీ అత్యధికంగా 76 స్థానాలు గెలుచుకుంది. రెండో స్థానంలో 73 సీట్లతో బీజేపీ నిలిచింది. గత ఎన్నికల్లో 71 సీట్లు గెలుచుకున్న ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పార్టీ జేడీయూ ఈ సారి 43 స్థానాలకే పరిమితమైంది.
కూటముల వారీగా చూస్తే.. అధికార ఎన్డీయేలో.. బీజేపీ 73, జేడీయూ 43, వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ(వీఐపీ) 4, హెచ్ఏఎం 4 స్థానాలు గెలుచుకున్నాయి. విపక్ష మహా కూటమిలో ఆర్జేడీ 76, కాంగ్రెస్ 19, లెఫ్ట్ పార్టీలు 16 సీట్లలో విజయం సాధించాయి. మొత్తంగా మహా కూటమికి 111 స్థానాలు వచ్చాయి. ఎంఐఎం 5, ఇండిపెండెంట్ 1, ఎల్జేపీ 1, బీఎస్పీ 1 స్థానాల్లో గెలుపొందాయి.
ఎగ్జిట్ పోల్స్ మాత్రం విజయం మహా కూటమిదేనని, కాబోయే ముఖ్యమంత్రి తేజస్వీ యాదవేనని అంచనా వేశాయి. కానీ అంచనాను తలక్రిందులు చేస్తూ ఎన్డీయే విజయం సాధించింది. 2015లో ఆర్జేడీతో కలిసి పోటీచేసి గద్దెనెక్కిన జేడీయూ, రెండేళ్లకే ఆర్జేడీతో విభేదించి, బీజేపీకి చేరువై, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి నితీశ్తో విబేధించి, ఎన్డీయే నుంచి బయటకు వచ్చి, సొంతంగా బరిలో నిలిచిన లోక్జన శక్తి పార్టీ(ఎల్జేపీ) ఈ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది. కేవలం ఒక్క స్థానాన్నే గెలుచుకుంది. కానీ, సుమారు 30 సీట్లలో శత్రు పక్షం జేడీయూ విజయావకాశాలను ఎల్జేపీ దెబ్బతీయగలిగిందని భావిస్తున్నారు.