హైదరాబాద్: కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఇవాళ్టినుండి రాత్రి కర్ఫ్యూని అమలు చేయనుంది. ఈ రోజు నుంచి మే 1వ తేదీ వరకు ఈ నైట్ కర్ఫ్యూ నిబంధనలు అమల్లో ఉంటాయని తెలిపింది.
కాగా ఈ రాత్రి కర్ఫ్యూ రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 వరకు కొనసాగుతుందని తెలిపింది. అత్యసవర సేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపునిస్తున్నట్లు తెలిపింది. దీంతో ఇక రాత్రి 8 గంటల వరకే బార్లు, రెస్టారెంట్లు, థియేటర్స్ నిర్వహణకు అనుమతి ఉంటుంది.
అదే విధంగా మీడియా, పెట్రోల్ బంక్లు, ఐటీ సేవలకు మాత్రం అనుమతిని ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇక కోల్డ్ స్టోరేజ్, వేర్ హౌసింగ్, విద్యుత్ సేవలు యథాతథంగా కొనసాగుతాయని, స్థానిక, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల్లో కూడా ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేసింది.
అలాగే, ప్రయాణీకులు తమ ప్రయాణాల కోసం ఎలాంటి ప్రత్యేకమైన పాసులు అవసరం ఉండదని పేర్కొంది. కరోనా పరిస్థితుల ప్రభావాన్ని అనుసరించి మే 1 తర్వాత తదుపరి నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించింది.
కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాధికారులు ఐడీ కార్డు చూపించి ప్రయాణాలు చేయవచ్చు. డాక్టర్లు, నర్సులు, పారామెడిక్స్, ఇతర ఆస్పత్రి సిబ్బందికి అనుమతి. గర్భిణులు, వైద్య సహాయం తప్పనిసరిగా అవసరమైనవారు, ఎయిర్పోర్టులు, రైల్వేస్టేషన్లు, బస్టాండు నుంచి రాకపోకలు సాగించేవాళ్లు టికెట్ ఖచ్చితంగా చూపించాలి.
గమనిక: నైట్ కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై విపత్తు నిర్వహణ చట్టం 2005లోని సెక్షన్ 51-60, ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం చర్యలు తీసుకోబడతాయి.