న్యూఢిల్లీ: చాలా రోజుల ఆక్సిజన్ సమస్యల తరువాత ఢిల్లీ ప్రస్తుతం ఊపిరి పీల్చుకుంటోంది. ఢిల్లీ లో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొంత తగ్గుముఖం పట్టగా, ఇప్పిడిప్పుడే ఆస్పత్రుల్లో బెడ్లు ఖాళీ అవుతున్నాయి. ఆక్సిజన్ డిమాండ్ కూడా బాగా తగ్గుముఖం పట్టింది.
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఇవాల కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఢిల్లీలో ఆక్సిజన్ డిమాండ్ బాగా తగ్గింది. కావాలంటే మిగులు ఆక్సిజన్ను అవసరమైన ఇతర రాష్ట్రాలకు కూడా ఇచ్చుకోవచ్చు అని తెలిపారు.
రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులలో తగ్గుదల కనిపిస్తోంది. ఆసుపత్రులలో పడకలు ఖాళీ అవుతున్నాయి. కోవిడ్ తీవ్రంగా ఉన్న సమయంలో ఢిల్లీకి 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరమైంది. రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత పడకల ప్రకారం ఢిల్లీ ఆక్సిజన్ డిమాండ్ రోజుకు 582 మెట్రిక్ టన్నులకు పడిపోయింది అని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశాము. మాకు ప్రతి రోజుకు 582 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరిపోతోందని, ఢిల్లీ కోటా నుంచి మిగులు ఆక్సిజన్ను ఇతర రాష్ట్రాలకు ఇవ్వండి అని విన్నవించాం, అని ఆయన చెప్పారు. మహమ్మారి రెండో దశలో కరోనా కేసుల సంఖ్య పెరగడంతో వారు బాధలో ఉన్నప్పుడు ఢిల్లీ ప్రజల సహాయానికి వచ్చినందుకు కేంద్రానికి, ఢిల్లీ హైకోర్టుకు ఈ సందర్భంగా సిసోడియా కృతజ్ఞతలు తెలిపారు.
తాజాగా ఢిల్లీలో ఒక్క రోజులో కొత్తగా 10,400 కేసులు నమోదయ్యాయి. ఇవి గతానికి కంటే చాలా తక్కువ. ‘నిన్నటి గణాంకాల కంటే 21 శాతం తక్కువ. పాజిటివిటీ రేటు 14 శాతానికి పడిపోయింది’ అని సిసోడియా వెల్లడించారు.