హైదరాబాద్: రిషబ్ పంత్ ఐపీఎల్ 2021 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా నియమితుడైన సంగతి తెలిసిందే. కాగా సమీప భవిష్యత్తులో టీమిండియా కెప్టెన్ అయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు అని భారత మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ అభిప్రాయపడ్డారు.
ఇటీవల ఇంగ్లండ్తో జరిగిన వన్డే సిరీస్ సందర్భంగా గాయపడిన శ్రేయస్ అయ్యర్ స్థానంలో పంత్ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్కు పూర్తిస్థాయి ఢిల్లీ కెప్టెన్ అయ్యాడు. పంత్కు ఢిల్లీ కెప్టెన్సీ దక్కడంపై పలువురు మాజీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ కోవలో భారత మాజీ కెప్టెన్, ప్రస్తుత హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్ కూడా చేరాడు.
క్రితం ఏడాది నుంచి మంచి ఫామ్ను కనబర్చి ఫైనల్ దాకా వెళ్లిన ఢిల్లీ లాంటి యువ జట్టుకు పంత్ను కెప్టెన్గా నియమించడం సరైన నిర్ణయమని, ఆ బాధ్యతలను పంత్ సమర్ధవంతంగా నిర్వర్తిస్తాడని అహహరుద్దీన్ కితాబునిచ్చాడు. గత కొద్ది మాసాలుగా అన్ని ఫార్మాట్లలో తాను రాణిస్తున్నాడని, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పర్యటనలలో అతని బ్యాటింగ్ విశ్వరూపం చూపించి టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషించాడని అజహర్ ప్రశంసల వర్షం కురిపించాడు.
కాగా రాబోయే రోజుల్లో రిషబ్ పంత్, భారత జట్టుకు కెప్టెన్ రేసులో అందరికన్నా ముందుంటాడని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు. తన దూకుడైన ఆటతీరు భవిష్యత్లో భారత్ను మరింత పటిష్ట స్థితికి చేరుస్తుందని అజ్జూ ట్వీట్ చేశాడు. శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్కు దూరమవ్వడం దురదృష్టకరమని, పంత్ తనకొచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టుకోగల సమర్ధుడని ఆయన కొనియాడాడు.