ముంబై: దేశ ఆన్లైన్ షాపింగ్ మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ అయిన పేటీఎం నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. దేశం మొత్తం మీద 20000 ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్లను త్వరలోనే నియమించుకోవాలని నిర్ణయించనట్లు తెలుస్తోంది. ప్రస్తుత మార్కెట్లో నెలకొన్న పోటీ మరియు త్వరలోనే పబ్లిక్ ఇష్యూకు వెళ్ళనున్న నేపథ్యంలో పేటీఎం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
అధికారికంగా కంపెనీ ప్రతినిధి ఈ విషయంపై వ్యాఖ్యానించనప్పటికీ, డిగ్రీ కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులుగా ప్రకటించే అవకాశం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ 20 వేల మంది ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్లకు నెలవారీ వేతనంగా 35 వేల రూపాయలు ఇవ్వనున్నట్లు త్లెఉస్తోంది.
కంపెనీ ఈ నూతనంగా నియమించుకునే ఉద్యోగుల ద్వారా పేటీఎం క్యూఆర్ కోడ్, పీవోఎస్ మెషీన్, పేటీఎం సౌండ్ బాక్స్, వ్యాలెట్, యూపీఐ, పేటీఎం పోస్ట్ పెయిడ్, మర్చంట్ లోన్స్, ఇన్సూరెన్స్ స్కీం లాంటి తమ సర్విసులను ప్రమోట్ చేయాలని చూస్తోంది. దీని వల్ల భారీగా వ్యాపార విస్తరణకు వీలు కలిగేలా ప్ర్ణాలికలు కంపెనీ రచిస్తోంది.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారి మే నెల వరకు అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా యూపీఐ మార్కెట్లో పేటీఎం కు 11 శాతం వాటా మాత్రమే ఉంది, కాగా ఈ జాబితాలో 45 శాతంతో మార్కెట్ వాటాతో ఫోన్ పే తొలి స్థానంలో మరియు గూగుల్ పే 35 శాతం వాటాతో రెందవ స్థానంలో కొనసాగుతున్నాయి.
పేటీఎం తమ ప్రత్యర్థులైన ఫోన్ పే, గూగుల్ పే సహా పలు ఫిన్ టెక్ కంపెనీల పోటీని ఎదుర్కొనేందుకు ఈ తాజా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇంకోవైపు రూ.16,000 కోట్ల పబ్లిక్ ఇష్యూ కోసం అక్టోబర్ నాటికి పేటీఎం భారత స్టాక్ మార్కెట్లోకి రానుంది. జూలై 15 న మార్కెట్ రెగ్యులేటర్ సెబీవద్ద ఇప్పటికే తమ ముసాయిదా పత్రాలను కూడా దాఖలు చేసింది పేటీఎం సంస్థ.