న్యూఢిల్లీ: దేశంలో రెండవ దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ సోమవారం మొదలయ్యింది. వయసు 60 ఏళ్లు పైబడిన, మరియు 45 ఏళ్లు పైబడి, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఈ దశలో కరోనా వ్యాక్సిన్ ఇవ్వబోతున్నారు. ఈ క్రమంలో భారత్ బయోటెక్ కోవిడ్ -19 వ్యాక్సిన్ ‘కోవాగ్జిన్’ షాట్ తీసుకున్న మొదటి వ్యక్తిగా ప్రధాని నరేంద్ర మోదీ నిలిచారు.
టీకా తీసుకున్న విషయాన్ని ప్రధాని స్వయంగా ట్విటర్ ద్వారా ప్రకటించారు. దేశాన్ని కరోనా రహితంగా చేసేందుకు అందరూ టీకా తప్పక తీసుకోవాలంటూ ఈ సందర్బంగా ఆయన పిలుపు నిచ్చారు. ఎయిమ్స్ టీకా కేంద్రంలో పుదుచ్చేరికి చెందిన సిస్టర్ నివేదా ప్రధాని మోదీకి టీకా ఇచ్చారు. కేరళకు చెందిన మరో సిస్టర్ రోసమ్మ అనిల్ కూడా ప్రధానికి టీకా వేసినప్పుడు అక్కడున్నారు. అయితే ఈ సందర్భంగా సిస్టర్ నివేదా, ప్రధాని మధ్య సంభాషణ ఆసక్తికరంగా మారింది.
కాగా టీకా వేసుకోడానికి ఈ రోజు ప్రధాని రానున్నట్టు ఈ ఉదయమే తనకు తెలిసిందని గత మూడేళ్లుగా ఎయిమ్స్లో విధులు నిర్వహిస్తున్న సిస్టర్ నివేదా తెలిపారు. ప్రధాని మోదీని కలవడం, ఆయనకు తాను టీకా వేయడం చాలా ఆనందంగా ఉందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. “లగా భీ దియా ఔర్ పతా భీ నహీ చలా ( వేసేసారా? టీకా వ్యాక్సిన్ వేసినట్టు అస్పలు తెలియనే లేదు) అని టీకా తొలి డోస్ వేసిన తర్వాత ప్రధాని ఆశ్చర్యం వ్యక్తం చేశారని తెలిపారు.
తదుపరి 28 రోజుల తరువాత ప్రధాని రెండో డోస్ తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఎక్కడి నుండి వచ్చామని అడిగారనీ, తమతో మాట్లాడారని ఆమె వెల్లడించారు. ఇది తనకు ఆశ్చర్యం కలిగించిందని కేరళకు చెందిన నర్సు రోసమ్మ అనిల్ పేర్కొన్నారు. టీకా తీసుకున్న తర్వాత ప్రధాని చాలా సౌకర్యవంతంగా ఉన్నారని ఆమె వ్యాఖ్యానించారు.