
టాలీవుడ్: సరిగ్గా పాతికేళ్ల క్రితం, జూలై 30న, మహేష్ బాబు హీరోగా మొదటి సినిమా ‘రాజకుమారుడు’ విడుదలయ్యింది. అందుకే ఈ రోజు ఘట్టమనేని అభిమానులకు చాలా ప్రత్యేకమైన రోజు.
సూపర్ స్టార్ కృష్ణ లెగసిని కొనసాగించే వారసుడిగా ఆ సమయంలో మహేష్ మీద ఉన్న అంచనాలు మామూలువి కాదు.
బాలనటుడిగా పలు చిత్రాల్లో మెప్పించినప్పటికీ, సోలో హీరోగా మారే క్రమంలో ఎన్నో పరిణామాలు జరిగాయి.
1990లో ‘బాలచంద్రుడు’ రిలీజయ్యాక, మహేష్ పూర్తిగా చదువుకు అంకితమైపోయాడు.
1993లో ‘యమలీల’ కథతో ఎస్వి కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డిలు వచ్చినప్పుడు, కృష్ణ కొన్నాళ్ళు ఆగమన్నారు. అయితే ఆ కథ అలీ హీరోగా బ్లాక్ బస్టర్ సాధించింది.
అదే సమయంలో, అగ్నిపర్వతం లాంటి ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన కృతజ్ఞతతో, వైజయంతి మూవీస్ అధినేత అశ్వినిదత్ చేసిన అభ్యర్థనని కృష్ణ మన్నించి, మహేష్ బాబు డెబ్యూ బాధ్యతలు ఆయనకు అప్పజెప్పారు. ఆ సమయంలో మంచి స్వింగ్లో ఉన్న పరుచూరి బ్రదర్స్ చెప్పిన కథ, సింగల్ సిట్టింగ్లో ఓకే అయిపోయింది.
వెంకటేష్ లాంటి స్టార్లను లాంచ్ చేసిన రాఘవేంద్రరావు కన్నా మంచి ఆప్షన్ కృష్ణగారికి కనిపించలేదు. దీంతో, ‘రాజకుమారుడు’ ఆయన చేతిలో పడ్డాడు.
ప్రీతీ జింతా హీరోయిన్గా, భారీ బడ్జెట్తో తెరకెక్కింది. పక్కా కమర్షియల్ అంశాలు, పవర్ ఫుల్ కృష్ణ క్యామియో, మణిశర్మ వినసొంపైన పాటలు, మహేష్ బాబు ఎనర్జీ, మాస్ క్లాస్ని ఆకట్టుకునే కథా కథనాలు వెరసి, ‘రాజకుమారుడు’ని సూపర్ హిట్ దిశగా నడిపించాయి.
శతదినోత్సవం జరుపుకోవడమే కాకుండా, రెండు నంది అవార్డులు కూడా దక్కాయి.
మహేష్ స్టామినా అర్థమైపోయి, నిర్మాతలు క్యూ కట్టారు. కట్ చేస్తే, ఈ పాతిక సంవత్సరాల ప్రయాణంలో మహేష్ చేసిన 28 సినిమాలే అయినప్పటికీ, రాజమౌళితో జట్టు కట్టేంత ప్యాన్ ఇండియా రేంజ్కి చేరుకున్నప్పటికీ, ‘రాజకుమారుడు’ జ్ఞాపకాలు మాత్రం సూపర్ స్టార్ అభిమానులకు ఎప్పటికీ స్పెషల్గా నిలిచిపోతాయి.