మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజ టోల్ప్లాజా వద్ద ఒక భారీ చోరీ వెలుగు చూసింది. ఒక లక్షా రెండు లక్షలు కాదు, ఏకంగా రూ.80 లక్షల విలువైన మొబైల్ ఫోన్లను దొంగిలించిన ఘటన బయట పడింది. సినీ ఫక్కీలో కంటైనర్లోకి చొరబడిన దొంగలు, ఫాక్స్కాన్ పరిశ్రమలో తయారైన 980 రెడ్మి ఫోన్లను సంచుల్లో నింపుకుని పారిపోయారు.
చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీ నుంచి కోల్కతాకు సెల్ఫోన్ల లోడుతో బయలుదేరిన కంటైనర్ వెనుక తాళాలను కత్తిరించిన దుండగులు, లోపలకి చొరబడి కొన్ని మొబైల్స్ను దొంగిలించి, వాహనం ఆగిన సమయంలో దిగి పారిపోయారు. కంటైనెర్ కు వెనుకగా వస్తున్న వాహనదారులు కాజ టోల్ ప్లాజా వద్ద కంటైనర్ డ్రైవర్కు దొంగలు చొరబడిన విషయాన్ని చెప్పారు.
దీంతో డ్రైవర్, సిబ్బంది బుధవారం ఉదయం మంగళగిరి రూరల్ పోలీస్స్టేషన్కు కంటైనర్తో సహా చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి, నార్త్జోన్ డీఎస్పీ దుర్గాప్రసాద్ మంగళగిరి చేరుకుని వివరాలు సేకరించారు. కంటైనర్లో మొత్తం రూ.9 కోట్లు విలువైన సెల్ఫోన్లు ఉన్నట్లు వెల్లడించారు.
సరిగ్గా మూడేళ్లకు ముందు కూడా ఇదే పరిశ్రమలో తయారైన మొబైల్ ఫోన్లు తరలిస్తున్న కంటైనర్ లారీ నెల్లూరుకు సమీపంలో చోరీకి గురైంది. ఆ సమయంలో కేసు నమోదు చేసిన పోలీసులు చోరీకి పాల్పడిన ముఠాను గుర్తించి కొంతమేరకు రికవరీ చేశారు. అదే ముఠా మళ్ళీ ఇప్పుడు చోరీకి పాల్పడిందా? లేక మరో కొత్త ముఠా అలాంటి పన్నాగం పన్నిందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.