హైదరాబాద్: ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల మోసాలపై ఐపీఎస్ అధికారి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పోరాటం కొనసాగుతోంది. సోషల్ మీడియాలో ఈ యాప్లను ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లూయెన్సర్లపై ఆయన విమర్శలు గుప్పించడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు.
సజ్జనార్ ట్విట్టర్ వేదికగా బెట్టింగ్ మాఫియాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. బెట్టింగ్ కారణంగా అప్పుల ఊబిలో పడవద్దని, జీవితాలను నాశనం చేసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో నెటిజన్లు ఓ కీలక విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్ల ప్రకటనలు కనిపిస్తున్నాయని, వాటిని తొలగించేలా చర్యలు తీసుకోవాలని నెటిజన్ ట్వీట్ చేశారు. “మీరు పోరాటం చేస్తున్నప్పుడు, హైదరాబాద్ మెట్రో ఈ ప్రకటనలకు అనుమతించడమేంటీ?” అంటూ ప్రశ్నించారు.
సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతోంది. సజ్జనార్ దీనిపై ఎలా స్పందిస్తారు? హైదరాబాద్ మెట్రో చర్యలు తీసుకుంటుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.