న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ రెండవ వేవ్ కాస్త తగ్గినట్లు అనిపిస్తున్నప్పటికీ, పూర్తిగా కిందకు రావడానికి ఇంఖా కాస్త సమయం పడుతుందని ప్రముఖ వైరాలజిస్ట్ షాహీద్ జమీల్ అన్నారు. రెండో వేవ్ ప్రభావం దాదాపు జూలై వరకు కొనసాగవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడానికి కొత్త వేరియంట్లు కారణం కావచ్చని అన్నారు. అయితే, ఈ కొత్త వేరియంట్లు మరింత ప్రాణాంతకం అనేందుకు ఆధారాలు లేవని అన్నారు. జమీల్ ప్రస్తుతం అశోక యూనివర్సిటీలో త్రివేదీ స్కూల్ ఆఫ్ బయోసైన్సెస్ లో డైరెక్టర్గా పని చేస్తున్నారు.
కాగా ఈ రెండో వేవ్ అప్పుడే అత్యంత తీవ్ర స్థాయికి చేరిందని అంచనా వేయడం తొందరపాటు చర్యే అవుతుందని ఆయన పేర్కొన్నారు. ‘ఇండియన్ ఎక్స్ప్రెస్’ సంస్థ మంగళవారం నిర్వ హించిన ఒక ఆన్లైన్ కార్యక్రమంలో వైరాలజిస్ట్ జమీల్ పాల్గొన్నారు. రెండో వేవ్లో కేసుల సంఖ్యలో తగ్గుదల కూడా మొదటి వేవ్ తరహాలో క్రమ పద్దతిలో ఉండక పోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
భారత్లో కోవిడ్ మరణాల డేటా కూడా తప్పేనని, అది ఎవరో కావాలని చేస్తోంది కాదని, మరణాలను గణించే విధానమే లోపభూయిష్టంగా ఉందని వివరించారు. డిసెంబర్ నాటికి కేసుల సంఖ్య భారీగా తగ్గిందని, దాంతో ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగిందని వివరించారు. పెళ్లిళ్లు, ఎన్నికల ర్యాలీ లు, మత కార్యక్రమాలు వైరస్ వ్యాప్తిని పెంచాయని అభిప్రాయ పడ్డ్రు.
కరోనా వైరస్ టీకాల వల్ల దుష్పరిమాణాలు వస్తాయన్న వార్తలు ప్రజలను బాగా భయపెట్టాయని, వ్యాక్సిన్లు సురక్షితమైనవని స్పష్టం చేశారు. చాలా దేశాలు చాలా ముందుగానే, ఉత్పత్తిదారుల నుంచి వ్యాక్సిన్లను బుక్ చేసుకోగా, భారత్ ఆ విషయంలో కాస్త వెనుకబడిందని అన్నారు. హెర్డ్ ఇమ్యూనిటీ రావడం కోసం జనాభాలో కనీసం 75% మందికి ఇన్ఫెక్షన్ రావడం లేదా వ్యాక్సిన్ ఇవ్వడం కానీ జరగాలని తెలిపారు.