ఏపీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి తన సోదరుడు, వైసీపీ అధినేత జగన్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. సరస్వతి పవర్ షేర్ల విషయంపై జగన్ స్వయంగా ఎంవోయూ మీద సంతకం చేశారని చెప్పారు.
ఇప్పటివరకు ఒక్క ఆస్తి కూడా తనకు ఇవ్వలేదని, అయితే తల్లి విజయమ్మకు గిఫ్ట్ చేసిన షేర్లపై మళ్లీ తనదని జగన్ పట్టుబడుతున్నారని మండిపడ్డారు.
విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ షర్మిల, “కన్నతల్లిపై కేసు వేసిన కొడుకుగా, మేనకోడలిని ముందుంచి ఆస్తులు కాజేసిన మేనమామగా జగన్ చరిత్రలో నిలిచిపోతారు,” అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి లాంటి వారిని అడ్డం పెట్టుకొని తనను తప్పుపడుతున్నారని అన్నారు.
ఆస్తులకంటే తనకు సంబంధాలే ముఖ్యమని భావించిన తానే తప్పుకానని షర్మిల చెప్పారు. జగన్కు విశ్వసనీయత ఉందా లేదా అన్నదాన్ని వైసీపీ నేతలు ఆలోచించాలన్నారు. రాజకీయ లబ్ధికోసమే తనపై కక్షతీర్చుకుంటున్నారని ఆరోపించారు.
ఇంతలో వక్ఫ్ బిల్లుపై జగన్ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని షర్మిల ఆరోపించారు. లోక్సభలో బిల్లును వ్యతిరేకించిన వైసీపీ, రాజ్యసభలో మాత్రం మద్దతు తెలిపిందని చెప్పారు. జగన్ సూచనలతోనే ఎంపీలు బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారని అన్నారు.
ఈ వ్యవహారాన్ని జాతీయ మీడియా కూడా ఎండగడుతోందని, జగన్ తీరుపై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయని షర్మిల చెప్పారు. దేశం మొత్తం చూస్తోంది, మాయలు ఇప్పుడు పని చేయవని అన్నారు.