హైదరాబాద్: బాలివుడ్ మరియు టాలీవుడ్ లో విలన్ పాత్రలు పోషించే రియల్ హీరో సోనూసూద్ ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ను ప్రగతిభవన్లో కలిశారు. ఈ సందర్భంగా సోనూసూద్ కరోనా మొదలైనప్పటి నుండి నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ అభినందించారు.
కరోనా నేపథ్యంలో దేశం మొత్తంగా నలుమూలల నుంచి ప్రజల నుండి వస్తున్న విజ్ఞప్తులకు ఎప్పటికప్పుడు స్పందిస్తూ సోనూసూద్ పనిచేస్తున్న తీరుపై కేటీఆర్ సమగ్ర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న కరోనా సంక్షోభ కాలంలో సోనూసూద్ ఒక ఆశాజ్యోతిగా, వ్యక్తిగత స్థాయిలో ఇంత భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేయడం చాలా గొప్ప విషయం అని మంత్రి కొనియాడారు.
సోనూసూద్ తన తల్లి స్పూర్తితో ఈ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పట్ల, ఇక్కడి వారి పట్ల తన అనుబంధాన్ని సోనూసూద్ పంచుకున్నారు. ఈ సమావేసం అనంతరం మంత్రి కేటీఆర్, సోనూసూద్కు లంచ్ ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన చేస్తున్న సేవ కార్యక్రమాలకు అభినందనగా శాలువాతో సత్కరించి, మెమొంటోను కూడా మంత్రి కేటీఆర్ అందజేశారు.