fbpx
Tuesday, October 22, 2024
HomeTelanganaతెలంగాణాలో ధరణి పోర్టల్ భాద్యతలు ఎన్‌ఐసీకి అప్పగింపు

తెలంగాణాలో ధరణి పోర్టల్ భాద్యతలు ఎన్‌ఐసీకి అప్పగింపు

telangana-government-hands-over-dharani-portal-management-to-nic

తెలంగాణ: తెలంగాణాలో భూ రికార్డుల నిర్వహణలో కీలక మార్పు త్వరలోనే చోటుచేసుకోనుంది. 2023 డిసెంబర్ 1వ తేదీ నుంచి ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలను టెర్రాసిస్ నుండి కేంద్ర ప్రభుత్వ నేషనల్ ఇన్‌ఫార్మాటిక్స్ సెంటర్ (ఎన్‌ఐసీ)కి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత మూడేళ్లుగా టెర్రాసిస్ సంస్థ నిర్వహణలో ఉన్న ధరణి పోర్టల్ వ్యవహారాలు డిసెంబర్ 1 నుంచి పూర్తిగా ఎన్‌ఐసీ చేతుల్లోకి వెళ్తాయి.

టెర్రాసిస్ కాలపరిమితి ముగింపు

ధరణి పోర్టల్ నిర్వహణ కోసం 2020 అక్టోబర్ 29వ తేదీన టెర్రాసిస్ సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చారు. మూడేళ్ల కాలపరిమితి ముగిసినప్పటికీ 2023 అక్టోబర్ 29న కాలపరిమితిని మరో ఏడాది పాటు పొడిగించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. కానీ ఇటీవల ప్రభుత్వం భూమి పత్రాల నిర్వహణలో పారదర్శకతను తీసుకురావాలనే ఉద్దేశంతో టెర్రాసిస్ సంస్థకు కాంట్రాక్టు రద్దు చేసి ఎన్‌ఐసీకి బాధ్యతలు అప్పగించే నిర్ణయం తీసుకుంది.

ఎన్‌ఐసీకి మూడు సంవత్సరాల కాంట్రాక్టు

రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌ఐసీతో 2023 డిసెంబరు 1వ తేదీ నుంచి మూడు సంవత్సరాల పాటు ధరణి పోర్టల్ నిర్వహణ ఒప్పందం కుదుర్చుకుంది. ఎన్‌ఐసీ మంచి ప‌నితీరును కనబరుస్తే ఈ ఒప్పందాన్ని మరో రెండు సంవత్సరాలు పొడిగించే అవకాశమున్నట్లు సమాచారం. ఈ మార్పు ద్వారా దాదాపు కోటి రూపాయల నిర్వహణ భారం తగ్గుతుందని రెవెన్యూ అధికారులు తెలిపారు.

సాంకేతిక పరిజ్ఞానం మార్పు

సాంకేతిక అంశాల దృష్ట్యా టెర్రాసిస్ సంస్థ నవంబరు 30 వరకు సాయం అందిస్తూ ఎన్‌ఐసీకి సాంకేతిక విషయాల్లో మార్పుల కోసం సహకరించనుంది. కొత్త సాంకేతికతతో ఎన్‌ఐసీ కార్యాచరణను పూర్తి స్థాయిలో చేపట్టనుంది. నవీన్ మిట్టల్ నేతృత్వంలో ప్రభుత్వ ఈ ప్రక్రియను వేగంగా పూర్తిచేస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

ధరణి స్థానంలో భూమాత

ధరణి పోర్టల్ స్థానంలో ‘భూమాత’ పేరుతో కొత్త పోర్టల్ ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ధరణి పోర్టల్ నిర్వహణను ప్రైవేట్ సంస్థ నుంచి ప్రభుత్వ సంస్థకు బదిలీ చేసిన సర్కారు, ఈ కొత్త పోర్టల్ ద్వారా భూమి సంబంధిత అన్ని అంశాలను మరింత పారదర్శకంగా, ప్రజలకు సులభంగా అందించేలా రూపొందించేందుకు సిద్ధమవుతోంది. ధరణి పోర్టల్‌లో పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, వాటిని దాదాపు పూర్తి చేశారు. ఇక పెండింగ్ దరఖాస్తులు కొత్త చట్టానికి సంబంధించినవి మాత్రమే మిగిలాయని అధికారులు తెలిపారు.

కమిటీ నిర్ణయం

టెర్రాసిస్ కాంట్రాక్టు ముగిసిన తర్వాత ఏ సంస్థకు బాధ్యతలు అప్పగించాలన్న విషయంలో కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. ఎన్‌ఐసీ, సీజీజీ, టీజీ ఆన్‌లైన్ సంస్థలు ఈ బాధ్యతలకు పరిశీలనకు వచ్చాయి. ఎన్‌ఐసీకి ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్‌లో ఉన్న సుదీర్ఘ అనుభవం కారణంగా చివరకు కమిటీ తుది నిర్ణయం తీసుకుంది.

25వ తేదీన కీలక సమావేశం

ఈ నెల 25వ తేదీన ధరణి ప్రాజెక్టును ఎన్‌ఐసీకి అప్పగించే అంశంపై కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో టీజీటీఎస్, ఎన్‌ఐసీ, టెర్రాసిస్ టెక్నాలజీ లిమిటెడ్ ప్రతినిధులు పాల్గొననున్నారు. ధరణి పోర్టల్ నుంచి భూమాత పేరుతో కొత్త పథకానికి మార్పు చేసే ప్రక్రియపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular