జాతీయం: మానవ చరిత్రలోనే అతిపెద్ద సంగమం: కుంభమేళా
50 కోట్ల మంది భక్తుల పుణ్యస్నానాలు!
ప్రయాగ్రాజ్లో కొనసాగుతున్న కుంభమేళాకు ఊహించని స్థాయిలో భక్తులు వస్తున్నారు. శుక్రవారం సాయంత్రానికి 50 కోట్లకు పైగా భక్తులు త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించినట్లు ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. మానవ చరిత్రలో ఏ మతపరమైన, సాంస్కృతిక లేదా సామాజిక కార్యక్రమంలో ఈ స్థాయిలో ప్రజలు పాల్గొనలేదని తెలిపింది.
శుక్రవారం ఒక్కరోజే సాయంత్రం 6 గంటల వరకు 92 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని, దీంతో ఇప్పటివరకు వచ్చినవారి సంఖ్య 50 కోట్లు దాటిందని యూపీ ప్రభుత్వం వెల్లడించింది. భారత్, చైనా మినహా అన్ని దేశాల జనాభాను ఈ సంఖ్య దాటేసిందని పేర్కొంది. ఇక్కడ స్నానాలు చేసిన వారి సంఖ్య అమెరికా, రష్యా, ఇండోనేసియా, బ్రెజిల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ దేశాల జనాభా కంటే ఎక్కువని తెలిపింది.
ప్రతి 12 ఏళ్లకు ఓసారి నిర్వహించే ఈ మహా కుంభమేళా జనవరి 13న మొదలై ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. మొత్తం 40 నుంచి 45 కోట్ల మంది రావచ్చని తొలుత అంచనా వేశారు. కానీ, అంచనాలకు మించి భక్తులు ప్రయాగ్రాజ్కు వస్తున్నారు. ప్రపంచం నలుమూలల నుంచి నిత్యం సరాసరి కోటిన్నర మంది వస్తుండటం గమనార్హం.
జనవరి 29న మౌని అమావాస్య రోజే దాదాపు 8 కోట్ల మంది ప్రయాగ్రాజ్కు వచ్చినట్లు యూపీ ప్రభుత్వం పేర్కొంది. అదే రోజు తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాటలో 30 మంది ప్రాణాలు కోల్పోగా మరో 60 మంది గాయపడిన సంగతి తెలిసిందే. మరో 12 రోజులపాటు కొనసాగనుండటంతో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కుంభమేళాకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలకు పాల్పడుతున్న వారిపై యూపీ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. గడిచిన నెలరోజుల్లో 53 సోషల్ మీడియా అకౌంట్లపై చట్టపరమైన చర్యలకు ఉపక్రమించినట్లు యూపీ పోలీసులు వెల్లడించారు. అసత్య సమాచారం, తప్పుదోవ పట్టించే వీడియోలు వ్యాప్తి చేస్తున్న వారిని ఎప్పటికప్పుడు గుర్తించి, వారిపై చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.