చిత్తూరు: ఏపీ లో ప్రభుత్వం పేదలందరికి ఇళ్ళు తొలి విడతలో నిర్మించనున్న ఇళ్ల పనులను సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘రాష్ట్ర వ్యాప్తంగా నేడు పండుగ జరుగుతోంది. సొంతిళ్లు లేని నిరుపేదల్లో చిరునవ్వు కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 30.75లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తున్నాం. తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలను చేపడుతున్నాం అన్నారు.
అమ్మ ఒడి, చేయూత, వసతి దీవెన వంటి పథకాల ద్వారా నేరుగా మహిళలకే నగదు అందిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. అవినీతికి తావు లేకుండా నేరుగా అక్కాచెల్లెమ్మల ఖాతాల్లోనే నగదు జమ చేస్తున్నాం అన్నారు సీఎం జగన్. అలానే ఇళ్ల పట్టాలను నిరంతర ప్రక్రియగా మార్చామని, అర్హులైనవారు దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లో ఇంటి స్థలం కేటాయించేలా ఆదేశాలు ఇచ్చామని తెలిపారు.
365, 430 చదరపు అడుగుల టిడ్కో ఇళ్లల్లో, 50శాతం లబ్ధిదారుల వాటాను ప్రభుత్వమే చెల్లిస్తుంది. దీనివల్ల ప్రభుత్వంపై 4,250 కోట్ల రూపాయల అదనపు భారం పడుతోంది’ అన్నారు సీఎం జగన్. ఇక ‘ఇళ్ల స్థలాల పంపిణీలో కులం, మతం, పార్టీ వంటి బేధాలు చూడలేదు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటిని అందిస్తున్నాం. పారదర్శకతలో భాగంగా లబ్దిదారుల జాబితాను గ్రామ సచివాలయంలో పెడుతున్నాం’ అని తెలిపారు.
ఇక ఇళ్ల నిర్మాణానికి మూడు ఆప్షన్లు ఇచ్చామన్నారు సీఎం జగన్. మొదటి ఆప్షన్లో నిర్మాణ సామాగ్రి, లేబర్ ఛార్జీలను లబ్ధిదారులకు ఇస్తాం. రెండో ఆప్షన్లో నిర్మాణ ఖర్చులను పురోగతి వారీగా డబ్బులు చెల్లిస్తాం. మూడో ఆప్షన్లో పూర్తిగా ప్రభుత్వమే ఇంటి నిర్మాణం చేసి లబ్ధిదారులకు అందిస్తాం అని తెలిపారు. లబ్ధిదారుల పేరుతోనే ఇంటి రిజిస్ట్రేషన్ చేయించాలనుకున్నాం అన్నారు. ప్రస్తుతం లబ్ధిదారులకు కేవలం ‘డి’ పట్టాలు మాత్రమే ఇస్తున్నామని.. న్యాయపరమైన చిక్కులు తొలగిపోగానే లబ్ధిదారులకు అన్ని హక్కులు కల్పిస్తామన్నారు.