బెంగళూరు: కరోనా మరో సారి పోలీసులపై పంజా విసిరింది. బెంగళూరు లోని పోలీస్ ట్రైనింగ్ స్కూల్లో 90 మందికి కరోనా వైరస్ సోకడంతో కలకలం రేగింది. బెంగళూరు సమీపంలోని థణిసంద్ర పోలీస్ శిక్షణా కేంద్రంలో ఓ కానిస్టేబుల్కి ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చింది.
ఈ నేపథ్యంలో ట్రైనింగ్ సెంటర్లోని అందరికీ కరోనా ర్యాండమ్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలో వారిలో 90 మందికి పైగా కరోనా పాజిటివ్ వచ్చినట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఇటీవలే కొత్తగా చేరిన దాదాపు 400 మంది కానిస్టేబుళ్లు పోలీస్ ట్రైనింగ్ స్కూల్లో శిక్షణ పొందుతున్నారు.
పాజిటీవ్ వచ్చిన కానిస్టేబుల్ ప్రైమరీ కాంటాక్ట్లో గుర్తించిన మరో 150 మందిని క్వారంటైన్కి పంపారు. అనంతరం ట్రైనింగ్ స్కూల్ పరిసరాలను శానిటైజేషన్ చేసినట్టు అధికారులు తెలిపారు.
ఐతే పాజిటివ్ వచ్చిన ట్రైనీ పోలీసుల ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. బెంగళూరు వ్యాప్తంగా ఇప్పటివరకు వెయ్యి మందికి పైగా పోలీసులు కరోనా బారిన పడ్డారు. అందులో తొమ్మిది మంది పోలీసులు ప్రాణాలను కోల్పోయారు.