వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి అధ్యక్ష ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఊరట లభించింది. ఆయనకి కరోనా తాజా పరీక్షలో కరోనా నెగెటివ్గా తేలింది. తనకి కరోనా పాజిటివ్ అంటూ ట్రంప్ ప్రకటించిన పన్నెండు రోజుల తరువాత ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో బయట పడ్డారు.
ట్రంప్కి చేసిన యాంటీజెన్ కరోనా పరీక్షల్లో నెగెటివ్ వచ్చిందని ఆయన వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ సియాన్ కాన్లే చెప్పారు. ఈ నెల 1న ట్రంప్ తనకి కరోనా సోకినట్టు వెల్లడించారు. ఆ తర్వాత మూడు రోజుల పాటు ఫ్లోరిడాలో ఎన్నికల ప్రచారానికి ట్రంప్ బయల్దేరడానికి కాస్త ముందు ట్రంప్కి కరోనా నెగెటివ్ వచ్చినట్టుగా సియాన్ కాన్లే ప్రకటించారు. ఇతర పరీక్షల్లో కూడా ట్రంప్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్టు వెల్లడైందని ఆయన తెలిపారు.
ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి ట్రంప్కి వచ్చిన ఇబ్బందేమీ లేదన్నారు. కరోనా పరీక్షల్లో నెగెటివ్గా తేలడంతో ట్రంప్ ఎన్నికల ప్రచారాన్ని ఇక విస్తృతంగా నిర్వహించనున్నారు. ఫ్లోరిడాలో ప్రచారం కోసం వెళుతూ ట్రంప్ మాట్లాడారు. అమెరికా చరిత్రలో ఈ ఎన్నికలు అత్యంత ముఖ్యమైనవి అన్నారు.
జో బైడెన్ అవినీతికి పాల్పడి డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా నామినేషన్ తెచ్చుకున్నారని ఆరోపించారు. సోషలిస్టులు, లెఫ్టిస్టులు, మార్క్సిస్టుల చెప్పు చేతల్లో ఆయన ఉన్నారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బైడెన్ నెగ్గితే రాడికల్ లెఫ్ట్ చేతుల్లోకి దేశం వెళ్లిపోతుందని అందరూ అప్రమత్తంగా ఉండాలని ట్రంప్ హెచ్చరించారు.