విశాఖపట్నం: విశాఖపట్నం లోని హెచ్పీసీఎల్లో ఇవాళ భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దీని వల్ల మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. సేఫ్టీ సైరన్ సకాలంలో మోగడంతో అక్కడి ఉద్యోగులు అంతా అప్రమత్తమై పరుగులు తీశారు. భారీగా శబ్ధం రావడంతో స్థానికులు స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.
హెచ్పీసీఎల్ నుంచి సాధారణం కంటే చాలా దట్టంగా పొగలు వ్యాప్తి చెందాయి. పరిస్థితిని ఫైర్ సిబ్బంది శ్రమించి అదుపులోకి తీసుకు వచ్చారు. ప్రమాద స్థలాన్ని చేరుకుని మంత్రి అవంతి శ్రీనివాస్, సీపీ మనీష్ కుమార్ అక్కడి పరిస్థితిని పరిశీలించారు. అయితే హెచ్పీసీఎల్ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, ఎవరికీ గాయాలు కూడా కాలేదని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు.
పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదని మంత్రి తెలిపారు. ఓవర్హెడ్ పైప్లైన్లో లీకేజి వల్ల ప్రమాదం జరిగిందని కలెక్టర్ వినయ్చంద్ తెలిపారు. సీడీయూ మూడో యూనిట్లో ప్రమాదం జరిగిందన్నారు. ఓవర్ హెడ్ పైప్లైన్ దెబ్బతినడం వల్ల ప్రమాదం జరిగిందని కలెక్టర్ వివరించారు.
యూనిట్ మొత్తాన్ని షట్డౌన్ చేశారని, ఇప్పుడు పరిస్థితి పుర్తి అదుపులోనే ఉందన్నారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రమాదం జరిగిన 15 నిమిషాల్లోనే సమాచారం వచ్చిందని, వెంటనే అంతా అప్రమత్తమయ్యామని తెలిపారు.