తిరువనంతపురం : కేరళ రాష్ట్రంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార లెఫ్ట్ డెమొక్రటిక్ ఫంట్ విజయం సాధించిన విషయం విదితమే. మొత్తం 941 స్థానాలకు గాను ఎల్డీఎఫ్ 516 పైగా స్థానాల్లో విజయకేతనం ఎగరేసి పూర్తి ఆధిక్యతను సాధించింది.
కేరళ రాజధాని తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్కు జరిగిన ఎన్నికల్లో 21 ఏళ్ల ఆర్యా రాజేంద్రన్ విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు. తాజా ఎన్నికల్లో విజయం సాధించిన ఆమె అతిపిన్న వయసున్న వ్యక్తిగా గుర్తింపు పొందారు. విపక్ష కూటమి నుంచి సీనియర్ అభ్యర్థి బరిలో నిలిచినప్పటికీ, ఆమె ముందు నిలవలేక పోయారు.
కాగా ఆమె అనూహ్యంగా మేయర్ అభ్యర్థిగా ఖరారయ్యారు. తిరువనంతపురం మేయర్ అభ్యర్థిగా ఆర్యా రాజేంద్రన్ను ఎంపిక చేస్తున్నట్లు ఎల్డీఎఫ్ పెద్దలు ఈ రోజు ప్రకటించారు. దీంతో దేశంలో అతిపిన్న వయసులో మేయర్ పీఠం అధిరోహించిన యువతిగా ఆమె రికార్డు సృష్టించనున్నారు.
ఆమె స్థానిక ఎల్బీఎస్ కాలేజీలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్నారు. అంతేకాకుండా స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో పార్టీ వ్యవహారాల్లోనూ ఆర్య చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎన్నికల్లో విజయంపై ఆమె స్పందిస్తూ, రాష్ట్రంలో విద్యాభివృద్ధికి మరింత కృషి చేస్తానని తెలిపారు.